చంద్రబాబు వద్దని చెపితే.. మేము ఊరుకోవాలా?: ధర్మాన ప్రసాదరావు

  • అమరావతి విషయంలో టీడీపీ హయాంలోనే మోసం జరిగింది
  • శివరామకృష్ణన్ నివేదికకే మేము కట్టుబడి ఉన్నాం
  • రాష్ట్రాలు సొంత రెవెన్యూల నుంచి రూ. 10 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఉంది
రాజధాని అమరావతి విషయంలో చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై ఈరోజు రాజమండ్రిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో టీడీపీ హయాంలోనే మోసం జరిగిందని చెప్పారు. శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేసేందుకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

ప్రస్తుతం ఏ రాష్ట్రం కూడా తమ రెవెన్యూల నుంచి రూ. 10 కోట్లు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. అమరావతి రైతుల ఆవేదన కరెక్టే కావచ్చు కానీ... అంత డబ్బును అమరావతిపై పెట్టే పరిస్థితి లేదని అన్నారు. పాలనా రాజధానిగా విశాఖ వద్దని చంద్రబాబు చెపితే తాము ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల విషయంలో మంచి నిర్ణయాలను ఇస్తే స్వీకరించేందుకు తాము సిద్ధమని చెప్పారు.

Dharmana Prasada Rao
YSRCP
Chandrababu
Telugudesam
Amaravati
Vizag

More Telugu News